PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 10:29 am Posted by : PEOPLES DAIRY NEWS

అధికారం రాగానే మారిన నైజం.. నల్లబెల్లిలో పట్టించుకోని పాలకులు!

నల్లబెల్లి:పీపుల్స్ డైరీ

నల్లబెల్లి మండల కేంద్రంలో పందుల సంచారం, దుర్వాసనపై నాటి విపక్ష నేతలు, నేటి పాలకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అధికారంలో లేనప్పుడు ఊరిలో పందుల వల్ల కంపు కొడుతోందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నాడు నల్లబెల్లి తహసీల్దార్‌కు స్వయంగా లేఖలు ఇచ్చి హడావుడి చేసిన నాయకులు… నేడు అధికారం చేతికి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా విస్మరించడం గమనార్హం.

నాడు తహసీల్దార్‌కు ఫిర్యాదు.. నేడు నిమ్మకు నీరెత్తినట్లు!

గతంలో పందుల సమస్యపై అప్పటి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన వార్డు మెంబర్, సర్పంచ్.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు.నాడు పందుల సంచారం వల్ల ఊరంతా కంపు కొడుతోందని, ప్రజల ఆరోగ్యం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.నేడు అధికారం చేతుల్లో ఉన్నా, సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడ?

పదవులు లేనప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నట్లు నటించి, తీరా అధికారంలోకి వచ్చాక అదే సమస్యలను గాలికి వదిలేయడం ఏంటని నల్లబెల్లి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్, వార్డు సభ్యులు స్పందించి, గతంలో తాము ఇచ్చిన లేఖను గుర్తుచేసుకుని, నల్లబెల్లి గ్రామంలో పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి..

నల్లబెల్లి గ్రామంలో పందుల సంచారం వల్ల తీవ్రమైన దుర్వాసన వస్తోంది, దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ సమస్యపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి బాధ్యులైన అధికారులు వెంటనే స్పందించి, పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.”

పొడేటి కిషోర్. గ్రామస్థుడు