కాల్చితే కాలుష్యం.. కలియదున్నితేనే భూసారం
కాల్చితే నష్టం.. కలియదున్నితే లాభం..
– సీఐ కరుణాకర్ రావు
– కొయ్యలు కాల్చొద్దు.. భూసారం కాపాడండి
– మంటల్లో మాడిపోతున్న నేల పోషకాలు
– సూక్ష్మజీవులు నశించి దిగుబడులపై తీవ్ర ప్రభావం
– నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసులు తప్పవు
– రైతులకు పలు సూచనలు చేసిన సీఐ కరుణాకర్ రావు
గణపురం, మే 27 (పీపుల్స్ డైరీ): పంట కోతలు పూర్తయ్యాక పొలాల్లో వరి కొయ్యలు, పంట వ్యర్థాలను తగులబెట్టే అలవాటు రైతాంగానికే ప్రమాదకరంగా మారుతోందని సీఐ కరుణాకర్ రావు హెచ్చరించారు. రైతులు అవగాహన లేకుండా చేస్తున్న ఈ చర్య భూమి సారాన్ని దెబ్బతీయడమే కాకుండా పర్యావరణ సమతౌల్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమి నిస్సారంగా మారి భవిష్యత్తులో సాగుకు అనుకూలత కోల్పోయే పరిస్థితి వస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఆయన మాట్లాడుతూ… వరి కొయ్యలు, పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమిలో సహజంగా ఉండే తేమ పూర్తిగా ఆవిరైపోతుందని చెప్పారు. భూమికి అత్యంత అవసరమైన సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి కీలక పోషకాలు మంటల్లో కాలిపోవడంతో నేలలో పోషక విలువలు గణనీయంగా తగ్గిపోతాయని వివరించారు. దీని ప్రభావం తర్వాతి పంటల దిగుబడులపై తీవ్రంగా పడుతుందని తెలిపారు. మంటల వేడి కారణంగా భూమి పైపొరల్లో నివసించే వానపాములు, సూక్ష్మజీవులు, జీవాణువులు వంటి ప్రకృతి సహజ సంపద నశిస్తోందన్నారు. ఇవే నేలను మెత్తగా ఉంచి పంట ఎదుగుదలకు సహకరిస్తాయని, అవి లేకపోవడంతో భూమి గట్టిపడి దున్నేందుకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో భూసారం తగ్గిపోవడంతో రైతులు అధిక ఎరువులు, ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల ఉత్పత్తి అయ్యే పొగ, బూడిద గాలిలో కలిసిపోవడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కంటి మంటలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వివరించారు. అలాగే ఒక పొలంలో వేసిన మంటలు పక్కనే ఉన్న పొలాలకు వ్యాపించి భారీ అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కొన్నిసార్లు విద్యుత్ తీగలు, చెట్లు, పశువుల కొట్లకు కూడా మంటలు అంటుకుని ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. రైతులు క్షణిక సౌలభ్యం కోసం చేసే ఈ పని చివరకు పెద్ద నష్టాలకు కారణమవుతోందన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటావేటర్ లేదా కేజ్ వీల్ చక్రాలతో కలియదున్నడం ద్వారా వరి కొయ్యలను నేలలోనే కలపవచ్చని తెలిపారు. అదేవిధంగా ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ ఉపయోగిస్తే రెండు నుంచి మూడు వారాల్లో పంట అవశేషాలు పూర్తిగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారుతాయని చెప్పారు. దీంతో భూమి సారవంతమై దిగుబడులు 5 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశముందని వివరించారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కరుణాకర్ రావు స్పష్టం చేశారు. రైతులు భూమిని కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు.