PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 9:32 am Posted by : PEOPLES DAIRY NEWS

జనసేనలో చేరిన సీనియర్ ఫార్మాసిస్టు, ట్రేడ్ యూనియన్ నాయకుడు బత్తిని సత్యనారాయణ గౌడ్.

జనసేనలో చేరిన సీనియర్ ఫార్మాసిస్టు, ట్రేడ్ యూనియన్ నాయకుడు బత్తిని సత్యనారాయణ గౌడ్.

 

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా – ప్రజాసేవ, ఉద్యోగుల హక్కులు, సామాజిక న్యాయమే లక్ష్యమని ప్రకటన

హైదరాబాద్, జూలై 11(పీపుల్స్ డైరీ)

వైద్య ఆరోగ్యశాఖలో గత మూడు దశాబ్దాలుగా ఫార్మాసిస్టుగా సేవలందిస్తూ, ఉద్యోగులు, ఫార్మాసిస్టులు మరియు నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సత్యనారాయణ గౌడ్ ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యుడు మాజీ వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బత్తిని సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, తన జీవితంలో ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేశానని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూనే ఉద్యోగుల సంక్షేమం, సేవా నిబంధనల అమలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు.

గత 30 సంవత్సరాలుగా ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో చురుకుగా పనిచేస్తూ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అనేక పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అధికారులను ప్రశ్నిస్తూ, చర్చలు జరుపుతూ, అవసరమైన సందర్భాల్లో ఉద్యమాలకు నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు.

అదే విధంగా, ఫార్మసిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం ను స్థాపించి, ఉద్యోగ అవకాశాల పెంపు, నిరుద్యోగ ఫార్మసిస్టులకు ఉపాధి అవకాశాలు, ఫార్మసీ విద్యార్థుల సమస్యలు, వృత్తి గౌరవం, ఫార్మసీ రంగ అభివృద్ధి కోసం మూడు దశాబ్దాలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫార్మసిస్టుల సమస్యలను ప్రభుత్వాలు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

జనసేన పార్టీలో చేరడానికి గల కారణాలను వివరిస్తూ, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తనను బాగా ఆకర్షించిందన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నించే ముక్కుసూటితనం, అవినీతి, అక్రమాలపై రాజీ లేని వైఖరి, ప్రజల సమస్యలపై నిస్వార్థంగా స్పందించే నాయకత్వ లక్షణాలు తనను జనసేన వైపు ఆకర్షించాయని పేర్కొన్నారు.

అలాగే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయ దృక్పథం, యువతకు స్ఫూర్తినిచ్చే నాయకత్వం తన ఆలోచనలకు దగ్గరగా ఉందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి నిజాయితీతో రాజకీయాలు చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

ఇకపై పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, తనకు ఉన్న ప్రజా ఉద్యమాల అనుభవాన్ని పార్టీ బలోపేతానికి వినియోగిస్తానని బత్తిని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యం, విద్య, ఉపాధి, యువత, ఫార్మసిస్టుల సంక్షేమం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై జనసేన పార్టీ ద్వారా మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జనసేనలో చేరడం తన రాజకీయ జీవితంలో ఒక కొత్త అధ్యాయమని పేర్కొంటూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా, పార్టీ ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పరిపాలన, అవినీతి రహిత వ్యవస్థ, ప్రజా సంక్షేమం కోసం జనసేన చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు బత్తిని సత్యనారాయణ గౌడ్‌ కు పార్టీలోకి స్వాగతం పలుకుతూ, ఆయనకు ఉన్న ప్రజా ఉద్యమాల అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.