- మహిళా న్యాయవాదిపై దాడి..
నిందితులు ఇంకా బయటే
న్యాయం కోసం న్యాయవాది పోరాటం
హైకోర్టు ఆదేశాలు ఉన్నా కదలని పోలీసులు..?
బోడుప్పల్:(పీపుల్స్ డైరీ):మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లిలోని ఓ మహిళా న్యాయవాది కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,న్యాయస్థానాలు జారీ చేసిన ఉత్తర్వులను సైతం అమలు చేయడం లేదని బాధిత న్యాయవాది మల్లుల శిరీష తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితులపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బాధితురాలి కథనం ప్రకారం అలేటి మోహన్ రెడ్డి,వెంకటేష్ నా రోజి,ప్రవీణ్ నారోజి,ప్రవీణ్ భార్య,తల్లి,మేఘనాథ్ తదితరులు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ వ్యక్తులపై సీనియర్ సివిల్ జడ్జి తనకు అనుకూలంగా మధ్యంతర నిషేధాజ్ఞ (ఇంటరిమ్ ఇంజంక్షన్) జారీ చేసినప్పటికీ,పోలీసులు దానిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.దాడి సమయంలో తన క్లయింట్లకు సంబంధించిన కీలకమైన కేసు ఫైళ్లు,పత్రాలు ఇతర ముఖ్యమైన మెటీరియల్ను నిందితులు బలవంతంగా తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.ప్రస్తుతం ఆమెటీరియల్ నిందితులవద్దే ఉన్నప్పటికీ,వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.ఈ వ్యవహారంపై హైకోర్టుకూడా నిందితుల వద్ద ఉన్న మెటీరియల్ను తిరిగి స్వాధీనం చేసుకొని బాధితురాలికి రక్షణ కల్పించాలని సూచించినప్పటికీ స్థానిక పోలీసులు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఆరోపించారు.అంతేకాక దొంగతనం అక్రమ ప్రవేశానికి సంబంధించిన తీవ్ర ఆరోపణలున్న ఘటనను పోలీసులు కేవలం సాధారణ క్రిమినల్ ఫిర్యాదుగా నమోదు చేసి కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారని విమర్శించారు.ఈ కేసులో దర్యాప్తు పక్షపాతంగా సాగుతోందని ప్రభావశీల వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.ఒక మహిళా న్యాయవాదిపైనే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ న్యాయం జరగకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని బాధితురాలు ప్రశ్నించారు.న్యాయస్థానాల ఆదేశాలను వెంటనే అమలు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరారు.కొందరు సహచర న్యాయవాదులు ఆమెకు మద్దతుగా నిలిచారు.