PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 7:39 pm Posted by : PEOPLES DAIRY NEWS

జర్నలిస్టుల పిల్లల పాఠశాల ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలి

– జిల్లా కలెక్టర్‌కు ‘టీఎస్జేయూ’ వినతి
– నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
– రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నరగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ నేతృత్వంలో కలెక్టర్‌తో భేటీ

నిర్మల్, జూన్ 10 (పీపుల్స్ డైరీ): జిల్లాలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజా సమస్యలపై వార్తా కథనాలు రాస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పెద్దపీట వేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయు) రాష్ట్ర కమిటీ కోరింది. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను టీఎస్జేయూ రాష్ట్ర, జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. పురుషోత్తం నరగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు స్థానిక కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల్లో 50 శాతం రాయితీ (కన్సిషన్) కల్పించేలా యాజమాన్యాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

– నిర్మల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అంతకుముందు, నిర్మల్ జిల్లా టీఎస్జేయూ గత కార్యవర్గ కాలపరిమితి ముగియడంతో రాష్ట్ర కమిటీ పర్యవేక్షణలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా సిరిగే రమేష్, ఉపాధ్యక్షుడిగా గోగుర్ల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాహుల్ గౌడ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నిర్మల్ జిల్లా బాధ్యులకు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నరగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడు సిరిగే రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం అహర్నిశలు పనిచేస్తుందని, యూనియన్ జెండాను జిల్లాలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలు, వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.