PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:45 pm Posted by : PEOPLES DAIRY NEWS

కీసరలో హృదయవిదారకం: ధోబీఘాట్ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యం

మేడ్చల్, మే 29 (మీడియా ప్రతినిధి):

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నాగారం విజయపురి కాలనీ రోడ్ నెం.4లోని ధోబీఘాట్ ప్రాంతంలో గుర్తుతెలియని నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

పోలీసుల కథనం ప్రకారం:

మే 28న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో, స్థానికుడు తిరుమల శెట్టి సోమరాజు ఇచ్చిన డయల్-100 సమాచారం మేరకు పెట్రోల్ మొబైల్-2 ఇన్‌చార్జ్ పి.సి జంగయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధోబీఘాట్ ప్రాంతంలో ఒక తెలుపు రంగు ప్లాస్టిక్ కవర్‌లో ఒకటి లేదా రెండు రోజుల వయస్సు గల నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు గుర్తించారు.

అక్కడి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు, అంబులెన్స్ సిబ్బందితో కలిసి శిశువును పరీక్షించగా.. అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు – దర్యాప్తు:

ఈ అమానుష ఘటనపై కీసర పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 497/2026 కింద, కొత్త చట్టం సెక్షన్ 93 బి.ఎన్.ఎస్ (BNS) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎస్‌.ఐ. బి. నాగరాజు కేసు నమోదు చేయగా, ఎస్‌.ఐ. కె. శ్రీనివాస్ దర్యాప్తును చేపట్టారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను సేకరించి, దర్యాప్తును ముమ్మరం చేశారు.