PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 7:56 am Posted by : PEOPLES DAIRY NEWS

నర్సంపేట నుండి శ్రీశైలం ప్రత్యేక యాత్రా బస్సు సర్వీస్ ప్రారంభం

నర్సంపేట నుండి శ్రీశైలం ప్రత్యేక యాత్రా బస్సు సర్వీస్ ప్రారంభం

పీపుల్స్ డైరీ నర్సంపేట

నర్సంపేట డిపో నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక యాత్రా బస్సు సర్వీసును ప్రారంభించింది. ఇది ప్రతిరోజూ నడిచే సాధారణ బస్సు సర్వీస్ కాదని, ప్రయాణికులు మరియు భక్తుల రద్దీని, డిమాండ్‌ను బట్టి మాత్రమే నడిచే ప్రత్యేక యాత్రా బస్సు (Special Tour/Yatra Service) అని అధికారులు స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా నర్సంపేట డిపో డ్రైవర్లు, సిబ్బంది బస్సుకు ఘనంగా పూజలు నిర్వహించారు. వాహనాన్ని పూలమాలలతో అలంకరించి, సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక ప్రార్థనలు చేసి బస్సును ప్రారంభించారు. ప్రయాణికుల ప్రయాణం క్షేమంగా సాగాలని డ్రైవర్లు ఆకాంక్షించారు.శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు గుంపుగా (గ్రూప్‌గా) ఏర్పడినప్పుడు లేదా పండుగలు, పర్వదినాల వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ బస్సు సర్వీసును నడుపుతారు.ఇంతకాలం శ్రీశైలం వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడిన స్థానిక భక్తులకు ఈ యాత్రా బస్సు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. నర్సంపేట మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని సమూహాలుగా బుక్ చేసుకుని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సరస్వతి తెలియజేసారు