- భీకర భూకంపంతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం
- కూలిన భవనాలు..
- సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో హై అలర్ట్
పీపుల్స్ డైరీ వెబ్డెస్క్ : దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీర దేశమైన ఫిలిప్పీన్స్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం దేశాన్ని వణికించింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భూకంపం ప్రభావం ఫిలిప్పీన్స్లోని ప్రముఖ నగరమైన జనరల్ శాంటోస్లో తీవ్రంగా కనిపించింది. నగరంలోని పలు బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార సముదాయాలు, నివాస గృహాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. భూమి తీవ్రంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు, రాత్రి విధుల్లో ఉన్న ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నగరమంతా అరుపులు, కేకలు, ఆందోళనలతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
భూకంప కేంద్రం గుర్తింపు…
భూగర్భ శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, జనరల్ శాంటోస్ నగరానికి నైరుతి దిశగా సుమారు 8 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు సంభవించడంతో ఉపరితలంపై తీవ్ర ప్రభావం చూపినట్లు నిపుణులు వెల్లడించారు. తక్కువ లోతులో సంభవించిన భూకంపాల వల్లే సాధారణంగా నష్టం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
సునామీ ముప్పు.. తీరప్రాంతాలకు హెచ్చరిక
భూకంపం సముద్ర తీరానికి సమీపంలో సంభవించడంతో సునామీ ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్ర గర్భంలో ఏర్పడిన మార్పుల కారణంగా తీరప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తీర ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
పొరుగుదేశాలకూ అప్రమత్త హెచ్చరికలు
ఈ భూకంప ప్రభావం ఫిలిప్పీన్స్కే పరిమితం కాకుండా ఆగ్నేయాసియా దేశాలపై కూడా పడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఫిలిప్పీన్స్తో పాటు ఇండోనేషియా, మలేషియా తీరప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయగా, కోస్ట్ గార్డ్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముమ్మరంగా సహాయక చర్యలు
భూకంపం అనంతరం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైన్యం, విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దించింది. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు రాబోయే గంటల్లో ఆఫ్టర్ షాక్స్ సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.
ఫిలిప్పీన్స్లో సంభవించిన ఈ భీకర ప్రకృతి విపత్తు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
