ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeవరంగల్పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం...

పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం…

📰 Generate e-Paper Clip

పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం

– 11వ రోజు త్రివేణి సంగమం వద్ద భక్తి వెల్లువ
– పుణ్యస్నానాలతో మార్మోగిన కాళేశ్వరం
– ఆదివారం కావడంతో భారీగా పెరిగిన యాత్రికుల రద్దీ
– ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లిన కాళేశ్వరం
– సంగమంలో స్నానాలు… స్వామి దర్శనాలకు క్యూలైన్లు

కాళేశ్వరం (భూపాలపల్లి), మే 31 (పీపుల్స్ డైరీ):

“కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం” అంటూ భక్తి పారవశ్యంతో జపిస్తూ వేలాదిమంది భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల 11వ రోజు ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసి భక్తి సముద్రాన్ని తలపించింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ క్షేత్రమైన త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, పితృతర్పణాలు, గోదానాలు, దానధర్మాలు నిర్వహించారు. అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదిలో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు ఉత్సాహంగా స్నానాలు చేశారు. త్రివేణి సంగమ పరిసరాలు “హర హర మహాదేవ”, “జై కాళేశ్వర ముక్తీశ్వర స్వామి” నామస్మరణలతో మార్మోగిపోయాయి. పుష్కర స్నానాల అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, ఘాట్లు, ప్రధాన రహదారులు భక్తులతో నిండిపోవడంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద నదిలో లోతైన ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు బోట్లు సిద్ధంగా ఉంచడంతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పుష్కరాల చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండగా, త్రివేణి సంగమం ఆధ్యాత్మిక కాంతులతో, భక్తుల గోవింద నామస్మరణలతో మరింత శోభాయమానంగా మారిందని అధికారులు తెలిపారు. 11వ రోజు కూడా ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పుష్కర స్నానాలు కొనసాగడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!