*నిరుపేదలకు అండగా ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ & ‘హెల్ప్ టు నీడ్’ సంస్థలు*
- భూపాలపల్లి జిల్లాలోని 125 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ*
- గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ అభ్యర్థనతో గ్రామం దత్తత*
సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ మరియు జెన్కో కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘హెల్ప్ టు నీడ్’ (Help to Need) స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 125 నిరుపేద కుటుంబాలకు రూ. 5,000 విలువచేసే 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.
*గాంధీనగర్ గ్రామం దత్తత – దివ్యాంగుడి కుటుంబానికి సహాయం:*
గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ అభ్యర్థన మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాయి. గడిచిన నెల రోజులుగా ఈ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు రూ. 5,000 విలువైన నిత్యావసర సరుకులను అందిస్తూ ఆదుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం (నిన్న) గ్రామానికి చెందిన తడుక అఖిల్ అనే దివ్యాంగుడి కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా జెన్కో కానిస్టేబుల్స్ నడుపుతున్న ‘హెల్ప్ టు నీడ్’ సంస్థ, అలాగే ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. కష్టకాలంలో పేద కుటుంబాలకు ఈ విధంగా సహాయం చేయడం గొప్ప విషయమన్నారు.ఈ సేవా కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

