గాంధీనగర్లో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
రెండు స్వచ్ఛంద సంస్థల సేవా దృక్పథం అభినందనీయం: సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్
గణపురం: పీపుల్స్ డైరీ
‘హెల్ప్ టు నీడీ’ (Help to Needy) మరియు ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకొని, గత నెల రోజులుగా గ్రామంలోని నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం (11-06-2026) గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద మహిళలు సెగ్గం విజయలక్ష్మి, పూరెళ్ల అమృతమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5,000 విలువ చేసే నిత్యావసర సరుకులను, బియ్యాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నిస్వార్థంగా గ్రామంలో సేవలు అందిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు.
“సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయం. ఇంకా ఎవరైనా దాతలు లేదా సి.ఎస్.ఆర్ (CSR) ఫండ్స్ అందించే కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’, ‘హెల్ప్ టు నీడీ’ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాలి. తద్వారా వీరి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని సర్పంచ్ కోరారు.ఈ సేవా కార్యక్రమంలో సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్తో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

