భద్రతకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాలు సాధించాలి
– భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి
– ఉత్పాదకత పెంపునకు నూతన క్రేన్
– కేటీకే ఓసీ-3లో 12 టన్నుల ఏస్ క్రేన్ ప్రారంభం
గణపురం, జూన్ 11 (పీపుల్స్ డైరీ):
గణపురం మండలంలోని కేటీకే ఓసీ-3 ప్రాజెక్టులో గనుల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన 12 టన్నుల సామర్థ్యంగల ఏస్ కంపెనీ క్రేన్ను జనరల్ మేనేజర్ ఎ. రాజేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు యంత్రాల నిర్వహణ పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ క్రేన్ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు అభివృద్ధికి అవసరమైన పలు సూచనలు చేస్తూ, గనుల నిర్వహణలో ఆధునిక యంత్రాల వినియోగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నూతన క్రేన్ అందుబాటులోకి రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడి, ఉత్పాదకత లక్ష్యాల సాధనకు తోడ్పాటునందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఏరియా ఇంజనీర్ వి. రాజారావు, ప్రాజెక్టు ఆఫీసర్ బిక్ష్మమయ్య, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు, ఓసీ ఆపరేషన్స్ మేనేజర్ సంపత్, ప్రాజెక్టు ఇంజనీర్ బి. శ్రీనివాస్ కుమార్తో పాటు అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పిట్ సెక్రటరీలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

