- జూన్ 9న అరుదైన గ్రహాల కలయిక!
- ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం..
- ఖగోళ ప్రేమికులకు ఆనందకర వార్త
- విశ్వచుంబనంగా నామకరణం…
- మిస్కాకుండా చూడండి…
- మళ్లీ ఇలాంటి సందర్భం ఎప్పుడొస్తుందో తెలియదు
ఆకాశం ఎప్పుడూ మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నక్షత్రాల మెరుపులు, గ్రహాల సంచారాలు, గ్రహణాల అద్భుతాలు ఎన్నో చూసిన మన కళ్లకు ఇప్పుడు మరో అరుదైన దృశ్యం కనువిందు చేయబోతోంది. జూన్ 9న రాత్రి ఆకాశంలో శుక్రుడు (వీనస్), గురుడు (జూపిటర్) అత్యంత దగ్గరగా చేరి కనిపించనున్నాయి. ఈ అరుదైన ఖగోళ ఘటనను ఖగోళ శాస్త్రవేత్తలు “ప్లానెటరీ కంజంక్షన్”గా పేర్కొంటుండగా, జ్యోతిష్యవేత్తలు మాత్రం దీనిని “విశ్వ చుంబనం”గా అభివర్ణిస్తున్నారు.
సాధారణంగా గ్రహాలు తమ తమ కక్ష్యల్లో ప్రయాణిస్తుంటాయి. అయితే భూమి నుంచి చూసినప్పుడు కొన్నిసార్లు అవి ఒకదానికొకటి అత్యంత సమీపంలో ఉన్నట్లు కనిపిస్తాయి. అలాంటి అరుదైన సందర్భమే జూన్ 9న చోటుచేసుకోనుంది. ఈ రోజున శుక్రుడు, గురుడు మధ్య దూరం కేవలం 1.5 నుంచి 1.6 డిగ్రీల మేర మాత్రమే కనిపించనుంది. ఇది పౌర్ణమి చంద్రుడి వ్యాసార్థం కంటే సుమారు మూడు రెట్లు ఎక్కువైనా, భూమిపై ఉన్నవారికి ఈ రెండు గ్రహాలు దాదాపు పక్కపక్కనే మెరిసిపోతున్నట్లు అనిపిస్తాయి.
ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన ఖగోళ వస్తువులలో శుక్రుడు, గురుడు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. అందుకే ఈ కలయిక మరింత ఆకర్షణీయంగా మారనుంది. సూర్యాస్తమయం అనంతరం పశ్చిమ-వాయువ్య దిశలో ఈ రెండు గ్రహాలు వెండి వెలుగులు చిందిస్తూ కనువిందు చేయనున్నాయి. టెలిస్కోప్ అవసరం లేకుండానే సాధారణ కంటితో స్పష్టంగా వీక్షించవచ్చు.
జ్యోతిష్య పరంగా కూడా ఈ ఘటనకు విశేష ప్రాధాన్యం ఉంది. కర్కాటక రాశిలో గురుడు, శుక్రుడు అత్యంత సమీపానికి రానున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో వీనస్ను ప్రేమ, శృంగారానికి ప్రతీకగా భావిస్తారు. హిందూ జ్యోతిష్యంలో శుక్రుడు స్త్రీ గ్రహంగా, గురుడు పురుష గ్రహంగా పరిగణించబడతాడు. అందుకే ఈ రెండు గ్రహాల కలయికను “విశ్వ చుంబనం”గా వర్ణిస్తున్నారు.
ఈ ఖగోళ నాటకానికి మరో ఆసక్తికరమైన మలుపు కూడా ఉంది. జూన్ 11న బుధుడు కూడా ఈ రెండు గ్రహాలకు దగ్గరగా చేరి, జూన్ 15 వరకు వాటితో కలిసి కనిపించనున్నాడు. దీంతో పశ్చిమ దిక్కున మూడు గ్రహాలు ఒకే ప్రాంతంలో మెరిసే అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. అయితే బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల అతడిని గుర్తించడం కొంత కష్టమవుతుంది.
భూమి నుంచి చూస్తే శుక్రుడు, గురుడు పక్కపక్కనే ఉన్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవానికి వాటి మధ్య దూరం కోట్ల కిలోమీటర్లుగా ఉంటుంది. అయినప్పటికీ విశ్వం మనకు చూపించే ఈ దృశ్య భ్రమ ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తుంది.
జూన్ 9న సూర్యాస్తమయం జరిగిన అరగంట తర్వాత ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ అవకాశం ఎక్కువసేపు ఉండదు. గ్రహాలు క్రమంగా హోరైజన్ వైపు సాగి అస్తమించిపోవడంతో దాదాపు గంటపాటు మాత్రమే ఈ దృశ్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఆకాశాన్ని ప్రేమించే వారు, ఖగోళ విశేషాలపై ఆసక్తి ఉన్న వారు, ప్రకృతి అద్భుతాలను తమ కళ్లారా చూడాలనుకునే వారు జూన్ 9 సాయంత్రం ఆకాశం వైపు తప్పక ఓసారి చూడాలి. ఎందుకంటే ప్రతి రోజు కనిపించని ఈ “విశ్వ చుంబనం” మరోసారి ఎప్పుడు దర్శనమిస్తుందో చెప్పడం కష్టం. విశ్వం తన అపారమైన సౌందర్యాన్ని మన ముందుంచే ఈ అరుదైన క్షణాన్ని ఆస్వాదించడం నిజంగా ఒక అపూర్వ అనుభూతి.
