“ఒక్క మొక్క.. ఎన్నో ప్రాణాలకు అండ”
– పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
– కేటీపీపీలో మొక్కలు నాటిన సిఈ శ్రీ ప్రకాష్
*గణపురం, జూన్ 05 (పీపుల్స్ డైరీ):*
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రకాష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని కేటీపీపీ ఆవరణలో ఘనంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ ఇంజినీర్ శ్రీప్రకాష్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం మానవాళికి సవాలుగా మారిందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి అవసరమైనప్పటికీ, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేటీపీపీ పరిసర ప్రాంతాలను మరింత హరితమయం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని, మొక్కల పెంపకం కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం అనంతరం మొక్కల సంరక్షణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. మొక్కలు నాటి… భూమిని కాపాడుదాం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరిలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించింది. ఈ కార్యక్రమంలో కేటీపీపీ అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
