కల్వర్టును ఢీకొట్టిన మినీ వ్యాన్..
తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం!
ఏన్కూరు (పీపుల్స్ డైరీ) : ఏన్కూరు మండలం రాజలింగాల – తిమ్మరావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఒక మినీ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన కొందరు వ్యక్తులు ఖమ్మం నుంచి మినీ వ్యాన్లో తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాజలింగాల మూల మలుపు వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని ఎయిర్ బెలూన్స్ సకాలంలో తెరుచుకోవడంతో ఒక చిన్నారితో పాటు ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రాజలింగాల మూల మలుపు అత్యంత ప్రమాదకరంగా మారిందని, గతంలోనూ ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని వారు మండిపడుతున్నారు. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని రాజలింగాల, తిమ్మరావుపేట గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రమాదకర మలుపును సూచించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేయాలి,
రాత్రి వేళల్లో దారి స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టర్లు, రోడ్డు మార్కింగ్లు ఏర్పాటు చేయాలనీ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

