చెల్పూర్ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రమాదం విధి నిర్వహణలోనే ప్రమాదం
20 రోజుల క్రితమే జిల్లాకు వచ్చిన అధికారి
పీపుల్స్ డైరీ, భూపాలపల్లి : విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీవో)ని అతివేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని చెల్పూర్ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఆర్టీవో వెంకన్న ఆర్టీవో కార్యాలయం సమీపంలో రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు లోడుతో వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వెంకన్న రోడ్డుపై పడిపోగా, ఆయన పైనుంచి లారీ వెళ్ళింది దాంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. కాగా, వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన మృతిచెందడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకన్న మృతిపై సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
