
పీపుల్స్ డైరీ,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్తి డా.ప్రసన్న హరికృష్ణ సోమవారం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం సుమారు 19 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని, అభ్యర్థుల కోసం వయోపరిమితిని పెంచాలని, జీవో నెం.46ను రద్దు చేయాలని, అలాగే నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డీజీపీని కోరారు. గతంలో విడుదలైన పోలీస్ నియామక నోటిఫికేషన్లలో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.46 కారణంగా కూడా అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని వివరించారు.
అదేవిధంగా, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళనల సందర్భంగా పలువురు యువతపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.డీజీపీ సానుకూలంగా స్వీకరించి స్పందించినట్లు ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విష్ణు వర్ధన్, మెండెం కిరణ్ కుమార్తో పాటు నిరుద్యోగ నాయకులు వంశీ, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
