పున్నమి వెలుగుల్లో పరవశించిన త్రివేణి సంగమం
– రాత్రివేళల్లో అపూర్వ దృశ్యంగా సంగమం
– విద్యుత్ వెలుగులతో కనులపండువగా ఘాట్లు
– కనులపండువగా విద్యుత్ అలంకరణలు…
– కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
– భక్తుల రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్ నియంత్రణ
కాలేశ్వరం (భూపాలపల్లి), మే 29 (పీపుల్స్ డైరీ):

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరం త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవిత్ర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సంగమ ప్రాంతం భక్తిజన సందోహంతో నిండిపోయింది. త్రివేణి సంగమ పరిసరాలను ప్రత్యేక సెట్టింగ్స్తో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు, ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించే కళాత్మక నిర్మాణాలు, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వెలుగుల కాంతుల్లో త్రివేణి సంగమం మరింత అందంగా మెరిసిపోతూ దర్శనార్థులకు కనువిందు చేస్తోంది. పున్నమి చంద్రుడి వెలుగులో పవిత్ర సంగమ క్షేత్రం అపూర్వ సౌందర్యాన్ని సంతరించుకుంది. భక్తులు పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరిస్తూ, ఆలయ దర్శనం చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతున్నారు. “ఈసారి చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు” అంటూ పలువురు యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, మార్గదర్శక బోర్డులు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. అదనంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తూ భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బస్సులు, పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో యాత్రికులు సౌకర్యవంతంగా పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. సరస్వతి అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు సాంస్కృతిక వైభవాన్నీ ప్రతిబింబిస్తూ భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని అందిస్తున్నాయి.








